జలపాతం

జలపాతం
ఆకలి వేసి ఏడుస్తున్న, బిడ్డని చూసిన తల్లిని ఆపడం....రామ నామ జపం చేస్తున్న చోటుకి వెళ్ళకుండా హనుమయ్యని ఆపడం.....మనిషిలోని 'ఆ మనిషిని' తట్టిలేపుటకు జాలువారిన ఈ " జలపాతం " జోరును ఆపడం.....బహుశా ఎవరికీ సాధ్యం కాదు - జైకిషన్ శింగరాజు

Wednesday, 20 July 2011

నడక నేర్పిన నడవడి....


అది 1967 డిసెంబర్ 10వ తారీఖు....ఉదయం 10 గం!!.....చెన్నైలోని మాంబ్లం - శివ విష్ణు దేవాలయ ప్రాంగణం. 
ఓ మహానుభావుడు, ఆ దేవాలయం బయట వేచియున్న వేలాది మంది హర్షద్వానాల మధ్య, రెండు చేతులూ జోడించి, ఎంతో సౌమ్యంగా " பிடி அரிசி திட்டம்  (పిడి అరిసి తిట్టం) (' పిడికెడు బియ్యం పధకం ') " అని ఉద్గాటించాడు.
మీరు రోజూ ఒక్క పిడికెడు బియ్యం తీసి పక్కన పెట్టగలిగితే.....ఈ దేశంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించరు......
మీ ఇంట తరతరాలూ కడుపునిండా భోంచేయగలరు " అంటూ నడిచే దేవుడుగా పిలవబడ్డ 68 వ కంచి కామ కోటి పీఠాదిపతి,  పరమాచార్య, మహాస్వామి, మహాపెరియవాళ్ శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామివారు, యావత్ భారతదేశానికి పిలుపునిచ్చారు. 

Paramacharya
                                                      
 ==============================================                                    

ఖాళీ రహదారి .....పెచ్చులూడిన రాళ్ళదారి....
' సీతా సీతా ' అని దిక్కులు పెక్కుటిల్లేలా అరుస్తూ, ఆ సీతారాముడు నడిచినది ఇదే దారి.....
గోవుల్నిమేతకు వదిలి,ఆటపాటలతో ఆ గోపబాలురకి తత్వాన్ని భోదించినదిక్కడే ఆ కృష్ణ మురారి....        
కాలడి నుండి కాలినడకన అద్వైతవేదాంత పరిమళాలను వెదజల్లిన శంకరభగవత్పాదులు చూపినదిదే  దారి....

నడిచి నడిచీ మొద్దుబారిన పాదాలకి పూలయితేనే.... ముళ్ళయితేనే... నడక సాగించారా బాటసారి....
నడిచి సాధించరా 'నువ్వేవ్వరివో నన్న' సత్యాన్ని మలుపోకోమారి.....  
అనుభవించరా ఉబికివచ్చే ఆ జ్ఞానామృతాన్ని ప్రతీసారి
 
అరణ్యాలు, కీకారణ్యాలు, చిట్టడవులు,జలపాతాలు, చెరువులూ, కుంటలూ, ప్రకృతి రమణీయ  సోయగాలు, అక్కడక్కడ తొంగిచూసే పచ్చని పంటలు.....అప్పుడప్పుడప్పుడు పలకరించి వెళుతున్నరోడ్డు వెంబడి గ్రామాలు ....ఇళ్ళ లోంచి పరుగున పరుగున చూడ వచ్చిన జనాలు.....వారి సాష్టాంగ నమస్కారాలు......2003 వ సంవత్సరం మండలం చలి గాలులు ......1005 కిలోమీటర్లు....30 రోజులు... బుద్ధుని వెంట నడిచిన భిక్షువులువలె గురు స్వామి వెంట నడుస్తున్న 38 మంది మాల ధరించిన స్వాములు.        

సికింద్రాబాద్ గణపతి దేవాలయం నుండి మొదలయిన ఆ నడక, పదునెట్టాంబడినెక్కి ఆ యోగముర్తిని దర్శించేదాకా దిగ్విజయంగా సాగింది.అడుగుకొక అక్షరంగా ఆ రమణుడి భక్తి వేదాంతాన్నినూరిపోసింది.

కొండాకోనల మధ్య, అడ్డదారుల గుండా, పొలంగట్ల మీదుగా, పిల్ల కాలువల వారుగా, జలపాతానికి - కొండకి మధ్యగల దారిలో, ఎలా వీలయితే అలా, ఈ దారులగుండా ఎన్నో సారులు ప్రయాణం చేసిన ఆ గురుపుంగవుని వెంట, నెత్తిన ఇరుముడి, భుజాన వంట సామగ్రి, వీపున వ్రేల్లాడుతున్న బ్యాగులో, నల్లని లుంగీ, ఓ దుప్పటి, " స్వామియే శరణం అయ్యప్ప " అని ఆ నిశబ్దాన్ని చేదిస్తూ, చేస్తున్న శరణఘోష ప్రియుని నామావళి. 


ప్రతిరోజూ ఉదయం 4 గం!! నిద్రలేచి, దగ్గరలోని నీటి వసతి వద్ద స్నానాదులు, పూజా పునఃస్కారాలు ముగించుకుని 6 గం!!లకు మొదలయ్యే నడక, 11 గం!! ప్రాంతంలో ఏదయినా నీటి సదుపాయంగల ప్రాంతంలో ఆగేసరికి, కనీసం 20 కిలోమీటర్లు పూర్తిచేయబడుతుంది. వంట - వార్పూ - బిక్ష , ముగించుకుని 2 గం!! లకు మళ్ళా మొదలయ్యే నడక 15 కిలోమీటర్ల తరువాత ఉండే ఏదేని వూరు, లేక ఓ చిట్టడవి,  ఆ ఊరిలోని దేవాలయం లేక ఆ చిట్టడవి లోని చెట్లే ఆ రాత్రికి మజిలి. వేసే ప్రతీ అడుగూ, వచ్చే ప్రతి మలుపూ.... ముందుకు నడిపిస్తున్న ఆ గురుస్వామిదే భారం.    
                   
అయిదేళ్ళ క్రితం కాలం చేసిన ఆ మహానుభావుడు, సెంథిల్ ఆర్ముగన్ అయ్యర్.....ఆరడుగుల పొడవుండే, ఆయన ఉక్కులాంటి శరీరం .....వెండి తీగలవంటి నెరసిన పెద్ద గెడ్డం......నిప్పు కనికెళ్ళాoటి కళ్ళు .......71 సంవత్సరాల వయసు (ఆనాటికి).....నుదిటిపై నామాలు.....ముఖం పై నిత్యం ఆనందం........తాతలనాడే తంజావూరు నుండి వరంగల్ వచ్చి స్థిరపడ్డ ఓ తమిళ సాంప్రదాయ కుటుంబం......50వ సారి అయ్యప్ప స్వామిని దర్శించుకోబోతున్నఆ మహానుభావుడే ' గురుస్వామి ఆర్ముగం '.  
  
           
---------------------------------------------

అలా సాగుతున్న ఆ ప్రయాణంలోఒక నాడు సాయంత్రం, కర్ణాటక రాష్ట్రంలోని 'కొడియల' అనే మారుమూల గ్రామం చేరుకున్నాము. ఆ గ్రామంలోని ఓ పాత సిద్దేశ్వరస్వామి దేవాలయంలో బస ఏర్పరచుకుని, ఆ గుడిని శుభ్రపరచి, పూజా పునఃస్కారాలు ముగించుకుంటుండగా, గురుస్వామి గుమగుమలాడే వేరుశనగ ఉప్మా వండి సిద్ధం చేసారు. 

ఆనవాయితీ ప్రకారం ఆ ఊరి వారిని పిలిచి దైవనామ సంకీర్తన, భజన మొదలగు కార్యక్రమాల అనంతరం,ఆ దైవానికి నైవేద్యం సమర్పించాక, మా కోసం ఒండుకున్న ఆ ఫలహారాన్ని ముందుగా వచ్చినవారికి పెట్టి, మిగతాది మేము తిన్నాము.

ఆ రోజూ అనుకోకుండా ఎక్కువమంది రావడం, అదీకాక వారిలో చాలామంది ఒకటికి నాలుగైదుసార్లు అడిగి మరీ తినడంతో, మాకు ఫలహారం సరిపడా మిగలలేదు. దాంతో బాగా ఆకలిగానున్న కొంతమంది స్వాములు కాసింత చిరాకు పడుతూ, దాన్ని గురుస్వామి ముందు ప్రదర్శించే ధైర్యం లేక మిన్నకుండిపోయారు.                       

ఇదంతా గమనించిన గురుస్వామి " పిడికెడు బియ్యం మీవి కావనుకుంటే ఈ జగత్తు కడుపునింపగలరు ......ఏదో ఒక నాడు ఈ జగత్తంతా తలాపిడికెడు మీకు వెనెక్కి ఇస్తుంది చూడండీ ......ఆనాడు మీ తరతరాలు కూర్చునితిన్నా కరగక నిలిచిపోగలదు.......మనం ఏది ఇచ్చినా, అది అంతయి - ఇంతై - ఇంతింతై మళ్ళా మనని వచ్చి చేరుతుందన్న విషయం మరవకండి ......అన్నదాన ప్రభువే - శరణం అయ్యప్ప " అని ఆ స్వాములను ఉద్దేశించి చెబుతూ, తమలో తాము నవ్వుకుంటూ విశ్రమించారు.

మరుసటిరోజు ఎదావిదిగా దగ్గరలోని చెరువులో స్నానాదులు, పూజాది కార్యక్రమాలు ముగించుకుని శరణఘోష చేస్తూ, సామాను తీసుకోవడానికి తిరిగి వస్తుంటే, మా జీవితాలను మలుపు తిప్పగల ఓ గొప్ప సంఘటన జరిగింది.

ఎప్పుడో గాని శుభ్రత ఎరుగని ఆ దేవాలయం.... మేము చెరువు నుండి తిరిగివచ్చే సరికి, చక్కగా నీళ్ళతో కడగబడి, మామిడాకుల తోరణాలు కట్టబడి, గుడి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయబడి....ఆ సిద్దేస్వరుణ్ని ఎంతో అందంగా అలంకరింపబడి..... కమనీయంగా, ఉన్నపళంగా ఓ పండుగ వాతావరణం నెలకొల్పబడియుంది.
ఈ రోజూ ఏదయినా పండుగా ? అని అనుకుంటూ వచ్చేంతలో.... 

ఆ ఊరి పెద్దా, తక్కిన జనసమూహం అంతా వచ్చి చేరారు.   
జంతికలు, మురుకులు,లడ్లు, చేగోడీలు,కారప్పూసా, వేయించిన మరమరాలు,శనగలు, బెల్లం వేరుశనగ ఉండలు ఇలా ఓ డజను వరకు పిండివంటలు ఒకరితరువాత ఒకరుగా ఆ సిద్దేశ్వర స్వామికి సమర్పించారు.  
ఇంతలో తెలిసిన విషయం ఏమిటంటే ........
క్రితం రాత్రి ఆ ఊరిలోని వారందరూ బృందాలుగా విడిపోయి, తలా ఒక చోట చేరి ఆ పిండివంటలన్నింటిని సిద్దపరిచారటా........
ఈరోజు ఏమిటీ ప్రత్యేకత ? అని అడగ్గా ......                

ఆ ఊరి పెద్ద, వినయంగా గురుస్వామి పాదాలకు నమస్కరించి " అయ్యా, మీరు దేవతల్లా వచ్చి మా చేత భజన చేయించి మరీ కడుపునిండా ఫలహారం పెట్టి పంపించారు. అందుకు ప్రతిగా మా వూరి వారంతా, వారికి తోచినది వండి మీకు సమర్పించదలచారు  .....కాదనక స్వీకరించండి " అని ప్రాదేయపడ్డాడు." అంతే కాదు...కొన్ని తగాదాల కారణంగా దూరమయిన మా ఊరిలోని కొంతమందిమి, చాలా కాలం తరువాత, మీ పుణ్యమా అని, ఒక్క చోట చేరి కలిసి భోజనం చేసాం.....ఆ దైవసాక్షిగా మళ్ళా మేమంతా కలిసాం.....ఆ ఆనందంతోనే ఇవ్వన్ని చేసితెచ్చాం.....దయచేసి కాదనకండి " అని ఆ పల్లె ప్రజలు బ్రతిమలాడారు. వారి వాత్సల్యాన్ని కాదనలేక గురుస్వామి నిశ్చేష్టులయి నిలబడిపోయారు.

ప్రతిఒక్కరి కాళ్ళు కడిగి, వారు నెత్తిన చల్లుకుని, వారి స్వహస్తాలతో ఆ తినుబండారాలను మాకు తిపిస్తుంటే.....
మా చెమర్చిన కళ్ళు , 'పిడి అరిసి తిట్టం' అన్న ఆ పరమాచార్యుని ప్రతిరూపంగా, మనం ఏది ఇచ్చినా అది అంతయి - ఇంతై - ఇంతింతై మళ్ళా మనని వచ్చి చేరుతుందన్నమా గురుస్వామిని చూడనివ్వకపోయినా.....
ఆయన వైరాగ్యపు చిరుమందహాసాన్నిమాత్రం మదిలో స్పష్టంగా చూడగలిగాము.

ఆ పిండివంటల్ని మూటలకెత్తి మరీ అప్పచెప్పారు ఆ ఊరువారు. 
కడుపునిండలేదని, రాత్రి విసుగుకున్న స్వాముల వైపు చూస్తూ, ఆ మూటలనెత్తుకోమని సైగచేసారు గురువుగారు.                                                        
దేనికోసమయితే మనము ఎక్కువగా ఆరాట పడతామో , అది ఈ విధంగా వచ్చి చేరుతుందని తెలుసుకున్న ఆ స్వాములు, దిగ్భ్రాంతి చెంది మరీ ఆ బరువయిన మూటలని భుజాలకెత్తుకున్నారు.

 ఎంత తిన్నా బరువుతగ్గని ఆ మూటల్ని పాపం ఆ స్వాములు రెండు రోజులు పాటు మోసారు. 
ఆఖరికి విసుగెత్తి ఓ సాయంత్రం, మేము బస చేస్తున్న ఊరిలో అందరికీ పనిమాలా వెళ్లి మరీ పంచొచ్చారు.

ఆ మరుసటి ఉదయం మేము బయలుదేరుతున్న సమయంలో, ఓ పెద్ద రైతు తన మనుష్యులతో వచ్చి, ఆ స్వాములని మాలో వెతికిమరీ పట్టుకుని " అయ్యా స్వాముల్లారా ....మీ తినుభండారాలను, ఇల్లు ఇల్లు తిరుగుతూ మా ఊరి వారికి మీరు పంచడం నేను స్వయంగా చూసాను. మీ పెద్ద మనసుకు నా నమస్కారాలు " అంటూ వారి పాదాలపై సాష్టాంగపడి " పాపం దారిలో మీకు ఆకలేస్తే తినడానికి ఏమయినా కావాలికదా ....అందుకే నాకు తోచినవేవో తెచ్చాను.....దయచేసి వీటిని స్వీకరించండి " అని ఉడకపెట్టిన శనక్కాయలు, బటానీలు , వేయించినా శనగలు, ఇంకా ఏవో ఓ నాలుగు పెద్ద బస్తాలను వారి పాదాల వద్ద ఉంచి, వీరు ఏదో అనే లోపే వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆ పెద్దరైతు, అతని మనుష్యులూ.  

"ఈ బస్తాల కన్నా ఇంతకుముందున్న మూటలే నయం కదా " అనుకుని, బిక్కమోకాలు వేసుకున్న ఆ స్వాములను చూసి, నవ్వాగాక ఒక్క సారిగా, గురుస్వామి తోపాటు అందరూ పగలబడి నవ్వారు. 

" ఇప్పుడు అర్ధమయిందా స్వాములు.....ఆరాటపడితే.....ఏమీ చేసుకోవాలో కూడా తెలియనంతగా వచ్చి పడుతుంది....ఆదరిస్తే ......ఏమీ చూసుకోకపోయినా, ఆ ప్రవాహమే ముందుక తీసుకెళ్ళుతుంది.......ఆరాటం బరువు......ఆదరణ సులువు "               

అని చెప్పి ఆ బస్తాలను సంచీలలోకి సర్ది, ఆ బరువును అందరికీ సమానంగా పంచారు గురుస్వామి ఆర్ముగం.
    


   ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే శరణం అయ్యప్ప   
జ్ఞానవైరాగ్య దాయకనే శరణం అయ్యప్ప  
అనాధరక్షకనే శరణం అయ్యప్ప 
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప 
ఆపద్భాందవనే శరణం అయ్యప్ప   
ఆర్యంగావు అయ్యవనే శరణం అయ్యప్ప  
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 


            జై కిషన్ శింగరాజు  

No comments:

Post a Comment