జలపాతం

జలపాతం
ఆకలి వేసి ఏడుస్తున్న, బిడ్డని చూసిన తల్లిని ఆపడం....రామ నామ జపం చేస్తున్న చోటుకి వెళ్ళకుండా హనుమయ్యని ఆపడం.....మనిషిలోని 'ఆ మనిషిని' తట్టిలేపుటకు జాలువారిన ఈ " జలపాతం " జోరును ఆపడం.....బహుశా ఎవరికీ సాధ్యం కాదు - జైకిషన్ శింగరాజు

Sunday, 19 June 2011

ఆ కాలి ముద్రలు నావి అనుకున్నాను....


'ఇప్పుడప్పుడే తెల్లారదు' అన్న దీమానో ఏంటో,వీదీలెమ్మడి పొగ మంచు వీర విహారం చేస్తోందీ.....కటిక నిశబ్దాన్ని ఛేదిస్తూ గోడ గడియారం లోని సెకెన్ల ముల్లు - గుండె చప్పుడుతో చేతులు కలిపింది....మనసు భారాన్ని పంచు కున్నందుకేమో సమయం కూడా భారంగా, రెండుగంటల నుండి పదినిముషాలు నడవడానికి అవస్థ పడుతోంది.            
  
మస్తిష్కాన్ని కకా వికలం చేస్తూ వచ్చి చేరుతున్న జ్ఞాపకాలూ.....శరీరాన్నీ, దాని చేతుల్లోని వెచ్చని కాఫీ కప్పునీ ఆ గదిలోనే వదిలి, మదిని టైంమిషిన్ విహారానికి పట్టుకు పోయిన గత స్మృతులు.
                        
======================================

ప్రొద్దున్నే నిద్ర లేచేసరికి, ఎదురుగా కనపడ్డ కొత్త బూట్లు....బైండింగ్ వేయించిన కొత్త పుస్తకాలు....కొత్త బ్యాగ్గు...ఆనందంగా వాటి వద్దకు వెళుతుంటే " త్వరగా వెళ్లి తయారవ్వు స్కూల్ టైమవుతుంది "... హడల్ కొట్టేలా వెనుక నుండి ఓ పెద్ద అరుపు.....

"నేను ఏడవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యా ......రాత్రి చెప్పుదామంటే, మీరు ఎంతకీ రాలేదు "   
"ఊ...సరే...ఇల్లు అలకగానే పండుగ్గాదు....ముందు ముందు పదో తరగతి పాసవ్వాలి " 
ఆనందం కాస్తా ఆవిరయ్యింది. దిగాలుగా వరండాలో కొచ్చి చూసేసరికి ' కొత్త Hero Ranger '.....
" హాయ్.... ఇప్పుటి వరకు ఈ సైకిల్ మా స్కూల్లో కాదు కదా....మా వూర్లో కూడా లేదు " ఆ ఆనందం తో ఆ ఊరిని ఓ వంద చుట్లు చుట్టాను.


" అమ్మా... నాన్న, పండూ వాళ్ళ నాన్న లాగ ఎప్పుడు పడితే అప్పుడు ఊర్లు వెళ్ళరా ? "  
" ష్....తప్పు అలా మాట్లడగూడదు.....నువ్వు బుద్ధి గా వుంటే ఆయన మటుకూ ఎందుకు కొడతారు " వంటి మీద వాతలు తేలిన బెల్టు దెబ్బలకి వెన్న పూస రాస్తూ సముదాయించింది ఆమ్మ.


"నాకంత కర్మ పట్టలేదు....నేనేమి మీ మోచేతి నీళ్ళు త్రాగి బ్రతకట్లేదు....మీరు ఈరోజు తెస్తున్న జీతానికి ఐదు రెట్ల ఎక్కువ జీతం నాది....కావాలనుకుంటే మా అమ్మని నాదగ్గరకి తీసుకెళ్ళి మహారాణిలా చూసుకోగలను" ఎవరు చదివిస్తే నేను చదువుకోగలిగానో, ఇంతడి వాడిని అయ్యానో.... 

ఆ విషయాలు ఏవీ ఆ రోజు నాకు గుర్తుకు రానివ్వని నా ఆవేశం....ఆయనతో మాటలు మాన్పించి మూడు సంవత్సరాలు దాటుతోంది.


నీళ్లెన్డిన చెరువులోంచి బయట పడ్డ చేపలాగ, ఆర్దిక మాంద్యం దెబ్బకి గిలగిల్లాడిన ప్రపంచ ఆర్దిక వ్యవస్థ, మకుటంలేని మహారాజులమని, మాకు మేమే సాటి అని విర్ర వీగిన మా లాంటి వాళ్ళ భ్రమని తొలిగిస్తూ, కళ్ళు తెరిపించే సరికి ఇంకేముంది......ఉద్యోగం పోయి రెండు నెలలయ్యింది.


తప్పని ఇంటి అద్దెలు, EMI లు, కరిగిపోయిన సేవింగులు, 'సున్నా' చుట్టిన బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇంకా మిగిలిన ఎడ్జెస్ట్మెంట్లు.......


కోటకట్టిన ఆత్మాభిమానం, కరుడుకట్టిన అహంభావం....అమ్మక్కూడా కూడా చెప్పుకోలేని  అయోమయం.
ఇంతలో..... 'కీ... కీ '....sms..... Rs.30000 has been credited to your account.Your present balance is Rs.28982.... అవాక్కయి బ్యాంకుకు పరిగెత్తగా....వారు చెప్పిన విషయం విని   గత 14 గంటల నుండి తెరుకుంటూనే ఉన్నాను. 

సాయంత్రం ఏడవ తరగతి ఫలితాలోస్తే, తెల్లారేసరికి వాకిట్లోకి కొత్త సైకిల్ ఎలా వచ్చిందని ఆనాడు అడగలేదు.....ఇక్కడ నా పరిస్థితి మీకెలా తెలుసని ఈనాడు అడగ దలుచుకోలేదు....కేవలం " నన్ను క్షమించండి నాన్న...నేను ఏనాడు మిమ్మల్ని అర్ధం చేసుకోలేదు " అని మాత్రమే చెప్ప దలచుకున్నాను ....తెల్లారితే ఫోను చేద్దామని, ఫోను పట్టుకుని మరీ యుగ - యుగాలుగా ఎదురుచూస్తున్నాను.                                                          


" హలో " .....
" ఆ .....నేను " ...... 
" మీ ఆమ్మ బయట కూరలు కొంటోంది....కొంచం అయ్యాక చెయ్యి "
" నాన్న ....నేను మీతోనే మాట్లాడాలి "  
" నాతో నా ..."  
" అవును నాన్న....." దుఖ్ఖం గొంతుని పూడ్చేస్తుండగా " నన్ను క్షమించండి నాన్న..... "
కన్నీటి దారా ప్రవాహం పొంగిపొర్లగా.....బరవయిన హృదయాలను కరిగిస్తున్న దుఖ్ఖంలో అటు నాన్న ఇటు నేను....
ముందుగా తేరుకున్న నాన్న" ఒరేయ్ కన్నా....ఇవ్వవలసిన వాళ్ళందరికీ సదిరేసి నువ్వు సామాను సదురుకుని వెంటనే బయలుదేరు...పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళా వెళ్ళుదువు గాని ....ఆమ్మ వచ్చేలా ఉంది....సరేనా....ఇదిగో మీ అబ్బాయి ఫోను " తనదైన శైలిలో ఫోను అమ్మకిచ్చి వెళ్ళిపోయారు నాన్న.
 
=================================


ఆ కాలిముద్రలు నడుస్తున్న నావి అనుకున్నాను...ఇప్పుడు తెలిసింది అవి నన్ను మోస్తున్న మీవని.
కనిపెట్టే ప్రేమ తల్లిది......నిలబెట్టే ప్రేమ తండ్రిది
  అది కన్న తండ్రైనా......జగాలేలే చల్లని తండ్రైనా   


HAPPY FATHER's DAY
  


జైకిషన్ శింగరాజు                     

Friday, 17 June 2011

విజ్ఞానం (పుడితే ఈ తరంలో పుట్టాలి - 1)


ఎవరో మహానుభావుడు చెప్పినట్టుగా ....పుడితే ఈ తరంలో పుట్టాలి.


        అని పాడుకుంటూ ఇల్లు తడిగుడ్డ పెట్టి తుడుస్తున్న ఓ తెలుగు విద్యార్ధికి ఖాళీగా కనపడ్డారు గురువు గారు. 


"గురువుగారు నాకు కనీసం ఈరోజయినా ' నన్నయ్య భట్టారకుడి ' విశేషాలు .....ఆది కవి ' ఆంధ్ర మహాభారత ' సాహిత్య వివరాలు గూర్చి వివరించండి....ఇప్పటికే నేను వచ్చి నెల రోజులు దాటుతోంది"  అంటూ ప్రాధేయపడ్డాడు తెలుగు సాహిత్యంలో Phd చేస్తున్న గోపాలంభట్ల శివ శంకర సుభ్రమణ్య శర్మ .

" ఒరేయ్ ఒరేయ్.....సుబ్బూ.... నాకు మటుకు నా వద్ద ఉన్నదంతా నీకు అప్పచేప్పాలని లేదట్రా  ? దేనికైనా సమయం రావాలి....కాస్త ఓపిక పట్టు వివరంగా అన్నీ తెలుసుకుందువుగాని " అంటూ నోట్లో తమలపాకులు  వేసుకుంటూ లేచెళ్ళారు , తెలుగు సాహిత్య పరిషద్ ఉపాధ్యక్షులు , తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకులు , పండితోత్తములు శ్రీ చతుర్వేదుల వీర వెంకట భగవన్నాద రామలింగేశ్వరుడు గారు.

"ఒరేయ్ వెర్రి సన్నాసి....భేషుగ్గా MA వరకు చదివి ఇదేమి కర్మ రా నీకు....లక్షణంగా మీ మావగారు తహిసిల్దార్ ఉద్యోగం వేయిస్తానంటే,  సాహిత్యము నా పిండాకూడు అంటూ వీడెవడి దగ్గరో పాలేరు వెదవలా ఊడిగం చేసుకుంటూ బ్రతుకుతానంటా  వెంటిరా అంట్లవెదవ " గురువుగారి ఇంటి వీదీ చివర, శివాలయం వద్దకు పిలిపించుకుని మరి తలంటాడు నాన్న....అయినా లాభం లేదు.                

రోజులూ వారాలూ నెలలూ ఏళ్ళు  ...అయ్యవారి కాళ్ళు పడుతూ.....అమ్మగారి దోసెల పిండి రుబ్బుతూ.....పాపాయి తల దువ్వుతూ.....బాబుని బడిలో దింపుతూ.....మొక్కలకు అంట్లు కడుతూ ......పాలేరు రాకపోతే అంట్లు తోముతూ.....పాలు పిండుతూ ....ఇలా దేనికైనా సిద్దపడుతూ మొత్తానికి ఎన్నో ఏళ్ళకు గురువుగారి పాండిత్యాన్ని  సాధించాడు పట్టు వదలని సుబ్రహ్మణ్యం.

=======================================                         

సరిగ్గా 50  ఏళ్ళ తరువాత ఒక రోజూ అనుకోకుండా , స్పేస్ బార్ లో ' నన్నయ్య ' అని టైప్ చేసారు Prof.G .S .S .S .SARMA . ప్రముఖ కవులు, retd . తెలుగు అధ్యాపకులు(ఆంధ్ర విశ్వవిద్యాలయం) , అధ్యక్షులు.తెలుగు సాహిత్య అకాడమి ( ఆం.ప్ర). 

అయన టైపు చేసిన వెంటనే,సెకను కన్నా తక్కువ సమయంలో, నన్నయ్య గారి తల్లిగారికి పురుడు పోసిన మంత్ర సాని వివరాల దగ్గర నుండి అయన పుట్టు పూర్వత్రాలు, విద్యాభ్యాసం, అయన రచించిన ఆణిముత్యాలు , గద్య కావ్యాన్ని పద్య కావ్యాన్ని కలుపుతూ వ్రాసే చంపు రీతిలో వ్రాసిన శబ్దాంధ్ర మహాభారతం - దాని పద్య సంపుటి, ఆది కవి, శబ్ద శాసనుడు , ఆంధ్ర శబ్ద చింతామణి మొదలగు బిరుదులూ....ఇలా ఒకటేమిటి....ఏ వివరం కావాలంటే ఆ వివరం....సెకన్లలో ఆయన ముందున్నాయి.

 " ఆహా ఎంత గొప్ప టెక్నాలజీ.....నిజంగా పుడితే ఈ తరంలో పుట్టాలి.... ఈ జ్ఞానం కోసం మాలాగా ఏళ్ళ కేళ్ళు వ్యర్ధ పరుచుకో నక్కరలేదు " అంటూ ఆనందంగా చూస్తున్నారు ప్రోఫెసోర్ గారు.   

"జీవితానికి జ్ఞానం ఒకటే సరిపోతుందా తాతగారు.....దానిని వినియోగించగలిగే అవగాహన ఉండద్దు"తత్వాన్ని ఉపదేసించినట్టుగా చెప్పింది మనుమరాలు Dr.ఈమని శ్రేయా శ్రీనివాస్, ప్రముఖ psychologist .

" మీరు అలా కష్టించి నేర్చుకోబట్టే, జీవితం పట్ల మీకు అవగాహన ,నేర్చిన విద్య పట్ల మీకు గౌరవం , సాధన ద్వారా దానిని మరింత మెరుగుపరచాలన్న తృష్ణ మొదలగు అమూల్యమయిన లక్షణాలు మీలో పెంపొందింపబడ్డాయి.
అందుకే సాధించిన దానిని పది మందికి పంచగలిగారు.మరి ఆ అవకాశాలు ఈ తరం వారికెక్కడివి. ఎంత సులువుగా జ్ఞానం లభిస్తున్నా రోజూ రోజుకి మనిషి లోని మనిషి అంతరించి పోతున్నాడు అంటే అదే కారణం"
 అని హడావుడిగా లేస్తూ "వెళ్లొస్తాను తాతగారు....మామయ్య కి ఫోన్ చెయ్యాలంటే ఇప్పుడే చెయ్యండి.... ఇండియాలో ఇప్పుడు సాయంత్రం 8 అవుతుంది....ఆలస్యం అయితే పడుకుండిపోతారు " అంటూ కార్ తాళాలు తీసుకుని clinic కి వెళ్లి పోయింది Dr.శ్రేయ

                                 
===============================================


గురుకులంలో గురుముఖంగా విద్య  నేర్చిన విద్యార్ధి, జ్ఞానంతో పాటు .....నేర్చిన విద్య పట్ల అపారమైన గౌరవం, జీవితంలో క్రమశిక్షణ, భాద్యతలపట్ల నిజాయితీ, చేసే పని పట్ల నిబద్ధత మొదలగు చక్కటి గుణాల సమ్మేళనంతో విద్య నబ్యసించి,  ఓ చక్కని సంస్కారం కలిగిన మనిషి గా వెలుగొందగలిగేవాడు. 


శ్రీ రాముడి దగ్గర నుండి స్వామి వివేకానందుడి వరకు, ఎందరో మహానుభావులకు లభించిన ఆ అవకాసం, పాపం ఈ తరానికెక్కడిదీ ? అపారమైన జ్ఞానం విచ్చలవిడిగా ' on - line ' లో దొరుకుతున్నా, కమ్యూనికేషన్ రంగం ప్రపంచాన్నికుగ్రామంగా మార్చేసినా.... 
అటు విద్యావిధానంలో, దానిని నేర్పుతున్న విద్యాలయాలలో, ఇటు పెంపకాలలో, దాని నుండి తయారయిన  సమాజంలో రోజు రోజుకీ క్షీణిస్తున్నకనీస విలువలు మనిషి లోని మనిషిని హరింపజేస్తున్నాయి.

పాలకుల దగ్గరనుండి భోదకుల వరకు, తల్లితండ్రుల నుండి భాద్యత కలిగిన విద్యాదికులవరకు, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితిని సమీక్షించి....Technology మెండుగా గలిగిన ఈ తరానికి, మానవీయ దృక్కోణాన్నిజోడించి, విలువలని  పెంపొందించ గలిగితే....

మహోన్నతమైన సౌజన్యం, ఔదార్యం, పావనత, ప్రశాంతత -  అన్నింటినీ మించి ఆద్యాత్మికత, అంతర్వీక్షనాలను మానవాళికి అందించిన మహత్తరమైన భూమి ఈ విశ్వంలో ఎక్కడైనా ఉంటే, అదే నా భరత భూమి " అన్న స్వామి వివేకానందుడి మాటలు ఎల్లప్పుడూ చిరంజీవిలుగా వర్దిల్లుతాయి.   



ఓం నమో భగవతే వాసుదేవయనమః 
      


                     
జైకిషన్ శింగరాజు 

     
      

Thursday, 16 June 2011

గ్లామర్ బాబు గ్లామర్...



" అక్కా..... అక్కా.....
 చిన్నీ....ఓయ్ చిన్నీ....చిన్నీ తల్లీ...అయ్యో ఏమిటీ ఎవ్వరు పలకరు....  ఇల్లంతా చీకటిగా ఉంది......ఎవ్వరూ లేరా..."

" లేకనేరా తమ్ముడు....ఇక్కడే ఉన్నాం అంతా....."

" అబ్బా...తూ ... హడిలిచచ్చాను.....అయినా ఇదేమిటక్కా చీకట్లో కూర్చున్నావ్ ...."

" ఇంకా ఏముంది కాబట్టి వెలుగులోకి రమ్మంటావ్ రా .....అంతా అయిపోయింది....." 

" ఏమయిందక్కా సడన్ గా నీకు ఇంత వైరాగ్యం.... అందరూ కులాసాఏనా  ?....."

" ఏం మాయరోగంరా మాకు .....దుక్కల్లా ఉన్నాం...."

" మరెందుకక్కా బాదపడుతున్నావ్....."

" బాదపడక..... జరుగుతుంది చూసి నవ్వుకోమంటావా...."

" అసలేం జరిగిందక్కా..... నాకేం అర్ధం కావడంలేదు  ....కాస్త వివరంగా చెప్పవూ "

" నాకు మటుకూ అర్ధమయింది గనకనా.....కంచిపట్టు చీర కట్టుకుని దాని పక్కన నుంచుంటే...టీవీలలో పేపర్లలో నన్ను చూసి.....అదిగో పావని వాళ్ళమ్మ....ఇదొగో పావని వాళ్ళమ్మ అంటూ జనాలు నన్ను గుర్తు పట్టడం .....ఎక్కడకి వెళ్ళినా జనాలు గుమిగూడడం....ఇలా ఎన్ని కలలు    కన్నానో.... ఛ ఛ అంతా అయిపోయింది.... "

" ఒక్క కంచిపట్టు ఏమిటి....బెనారస్ బెంగళూరు పోచంపల్లి పుట్టపాక్షి .....ఇలా ఏది కట్టినా నిన్ను పావని వాళ్ళ అమ్మనే అంటారు...."

" ఇంకిప్పుడెoదుకంటారు.....అంతాయిపోయింది "     

" అబ్బబ్బా నాకు పిచ్చెక్కుతోంది అక్కా .....చిన్నీ..... చిన్నీ ....."

" ఏంటి మామయ్యా....."

" ఓ నువ్వూ ఇక్కడే ఉన్నావ్.....అసలేమయిందే బాబూ .....మీ అమ్మ అలా మాట్లాడుతుందేమిటి ..... నా తల్లి కదూ....నువ్వైనా కాస్త వివరంగా చెప్పవే పావని ! "

" నన్నేమి అడక్కు మామయ్యా నాకేమి తెలియదు....అంతా అయిపోయింది...."

" అంతా అయిపోయిందని మటుకు తెలుసు....ఓరి భగవంతుడా ఎరక్కపోయి ఈవేళ వీళ్ళ ఇంటికి వచ్చినట్టున్నాను  ....ఇంతకీ ఏడి.... మా బావేడీ ?...." 

" ఇందాకడినుండి నువ్వు కూర్చుంది వాడి కాలు మీదే... నీపక్కనే ఉన్నాను ...."

" హయి...నూతిలో దొరుకుతున్నపాతసామానులాగ అంతా ఇక్కడే దొరుకుతున్నారన్నమాట..... 
 సరేగాని బావా.... ప్రేతాత్మల్లాగా ఈ చీకట్లో మీటింగూ....ఏడుపులూ నిట్టూర్పులు....అసలేమయింది ?"

" ఇంకా ఏమి అవలేదు....ఏదో అవ్వకూడదనే ఈ నిర్ణయం "

" ఏ నిర్ణయం బావా "     

" చిన్నీ ఇక నుండి బ్యాడ్మింటన్ ఆడకూడదని నిర్ణయం"             

" ఏమిటీ.... స్టేట్ చాంపియన్ మన పావని ఇక ఆడకూదదా ? ఏమిటి బావా నువ్వు మాట్లాడుతోంది "

" అదీ... అలా అడగరా తమ్ముడూ...అడిగి అడిగి సమాధానం దొరక్క ఏడుస్తున్నాం ఇందాకడినుండి " 

"ఒరేయ్...మాది నిప్పులు కడిగిన వంశంరా....ఇంతజరిగినా అది బ్యాడ్మింటన్ ఆడుతోంది అంటే మమ్మల్ని కుటుంబం నుండి వేలేస్తారు..... ఇక జన్మలో దానికి పెళ్లవ్వదు "

" బావా బ్యాడ్మింటన్ కి - వెలేయడానికి ..... మళ్లీ దాని పెళ్ళికి....అస్సలు సంబంధం ఏమిటీ....? " 

" నువ్వు మీ అక్కా రోజూ కనీసం పేపర్ అయినా చదివేడుస్తే నా బాధ మీకు అర్ధమయ్యేది "

" ఇంతకీ విషయం ఏమిటి బావా ? "

" బ్యాడ్మింటన్ ఆటకు అనుకున్నంత ప్రజాదరణ లేదనీ....ఆదరణ పెరగాలంటే ఆడ ప్లేయర్లంతా నిక్కెర్లకు,గౌన్లకు బదులుగా పొట్టి స్కర్ట్లను మాత్రమే వేసుకోవాలని...అలా వేసుకోని యెడల వారు ఆడుటకు అర్హులు కారని, ఏప్రిల్ 15 2011 నాడు బ్యాడ్మింటన్ సమాఖ్య తమ నిర్ణయాన్ని వెల్లడించింది "

" అదేమిటి బావా... ఆటలోని నైపుణ్యాన్ని బట్టి ఆదరణ గాని...పొట్టి గౌన్లు వేస్తే ఎగబడతారా....ఒక వేళ అలా ఎగబడినా, ఆటకు ఆదరణ పెరిగినట్టెలా అవుతుంది ? "

"నిర్ణయించే వాడి ఆలోచన అలా తగలడితే మనం మటుకు ఏమి చెయ్యగలం రా....మనదేశంలో క్రికెట్ కి అంత ఆదరణ ఉండి కూడా, చీర్ గాళ్స్ బీభత్సాలు చూడడంలా  ....ఇదీ అంతే. 
ఆడవాళ్ళు అలా కనపడితే గాని, కనీసం ఆటని కూడా చూడలేని బుద్ది తక్కువ వెదవలకి పెత్తనాలప్పచేప్తే.....నిర్ణయాలు ఇలా కాక, మరోలా ఉంటాయా చెప్పు" 

"బ్యాడ్మింటన్ ఆటలో మన భారతదేశ కీర్తిప్రతిష్టలను పెంపొందిస్తున్న మన హైదరాబాద్ అమ్మాయి, జూనియర్ ప్రపంచ చాంపియన్ సైనా నెహ్వాల్ స్వయంగా, ఈ పొట్టి స్కర్ట్ విషయంలో అభ్యంతరం చెప్పినా....కొన్ని మ్యాచ్ లు ఆడితే నీకే అలవాటవుతుంది అని ఉచిత సలహా కూడా ఇచ్చిందట సమాఖ్య "                          

"వాడి దిక్కుమాలిన ప్రజాదరణ కార్యక్రమంలో భాగంగా, ఏ మొహం పెట్టుకుని నాకూతురికి పొట్టి గౌను వేసి ఆడించ మంటావ్ చెప్పు....అందుకనే ఈ సంవత్సరం ఆ డిగ్రీ కాస్తా పూర్తయిందనిపించి, ముద్దు ముద్దుగా ఏ అయ్య చేతిలోనో పెట్టేసానంటే, నా భాధ్యత తీరిపోతుంది"       
===========================

Playing with the Shorts
Playing with Skirt

-----------------------------------------

భక్తి టీవీ చానళ్ళ న్యూస్ రీడర్ దగ్గర నుండి బ్యాడ్మింటన్ ప్లేయర్ ల దాకా అందరూ గ్లామరస్ గా ఉండాలనుకోవడం సబబు కాదు....అలా ఉంటే అది గ్లామరూ కాదు.....ఒకవేళ అదే గ్లామర్ అయితే..... గ్లామర్ అనే పదం, తప్పకుండా అందమనే మాటకి, ఇంగ్లీషు తర్జుమా కానేకాదు....వికారం అనే మాటకి నిర్వచనం అయిఉండాలి. ఇది తెలుసుకో గలిగితే.....అందమూ, ఆట, గ్లామరూ .....దాని నుండి  సమాజమూ... అన్నీ సురక్షితము.              


జైకిషన్ శింగరాజు  

Wednesday, 15 June 2011

సముద్రవసనే దేవి

                                                               
    "సముద్రవసనే దేవి 
     పర్వతస్థన మండలే  
     విష్ణు పత్నీ నమస్తుభ్యం 
   పాద ఘాతం క్షమస్వమే"


అని నమస్కరిస్తే గాని, నిద్రలేచాక పక్క మీదనుండి భూమి మీదకి, కాలు కూడా మోపని మహోన్నతమైన జాతి మనది .


అడవులను వనదేవతలుగా, ఆ మూగజీవాలను విశ్వవ్యాప్తమయిన భగవత్ స్వరూపాలుగా, నదులను పుణ్య మూర్తులుగా, పర్వతాలను ధ్యానముద్రలో కూర్చుని ఉన్న ముని పుంగవులుగా.....
చెరువులూ, కుంటలూ మొదలగు వాటిని ఆ ఊరి శివాలయంలోని శివయ్య కొరకు వేచిఉన్న గంగమ్మతల్లిగా, మా కడుపు కోసం ఈ నాగలి పోటూ - క్షమించు తల్లీ,అని నమస్కరించి కష్టించగా, ఇంద్రాది వరుణదేవతలు సహకరించగా, చేతికొచ్చిన పచ్చని పంటని, ఉండబట్టలేక తమ ఊరి విశ్వనాథుని చెంతకురికొచ్చిన అన్నపూర్ణేశ్వరిగా.....ఆ పంట తెచ్చిన సిరిని, ' దాచుకున్నారట్రా నా స్వామిని మీ ముంగిట ' అంటూ కొల్హాపురం గడప దాటొచ్చిన ' శీనయ్య పట్టమహిషి ' గా.....ఒకటేమిటి కంటికి కనపడ్డ చెట్టు - పుట్టా కొండా - బండా నీరు - నిప్పు ....ఇలా ప్రతిదానిలోనూ ఆ చిద్విలాస స్వరూపాన్ని దర్శింపజేసిన దివ్యమైన ధర్మం మనది.   


ఊరి చెరువు మధ్యలోని మెత్తని బంకమన్నును తవ్వి తీసి,  తొమ్మిది రోజుల పాటు వొదిలేస్తే చెరువులోకి  నీటి ఊట....తరువాత అలా తీసిన
మట్టికి, వనమూలికలు, ఔషద గుణాలున్నఆకులు అలములు జతకలిపి ఆ చెరువు మధ్యలోకి ' నిమర్జనం ' చేస్తే ఇక మళ్ళా వచ్చే'భాద్రపద చవితి' దాకా చెరువు పరిశుభ్రం అన్న మాట.
మట్టితో చేసిన వినాయకుడు
ఇలా ప్రతి పండుగా, ప్రతి నియమము, ప్రతి మంత్రము, ప్రతి చర్య -- ప్రకృతి వొడిలో ఆ ప్రకృతిని పెనవేసుకుని ప్రకృతిని అనుసరిస్తూ ప్రాకృతికంగా నిర్దేసింపబడిన గొప్ప సంస్కృతి.


                                        
ఇంత గొప్ప సంస్కృతిని కలిగిన మన జాతి...ఆ సంస్కృతిని ఇచ్చిన మన ధర్మం....ఆ ధర్మం నివసించిన మన భారతదేశం....ఈ రోజూ ప్రపంచంలోని అత్యంత కలుషితమైన దేశాలలో పై నుండి మూడవ స్థానం. ఇదీ విషయం.           


    సముద్రవసనే దేవి - రాబోయేకాలంలో ఆ వసనంతోనే నిన్నుపూర్తిగా కప్పేసే ప్రమాదం పొంచి ఉంది తల్లీ.
    పర్వతస్థన మండలే - మా కడుపులు నింపిన ఆ గోముఖం...గంగోత్రికి నేడు బహు దూరం. 
    విష్ణు పత్నీ నమస్తుభ్యంచేతులు కాలాయి, ఇక ఆకులు పట్టి నమస్కరిస్తాం(ఆకులూ కరువే సుమా) 
    పాద ఘాతం క్షమస్వమే - ఒక్క పాదం ఏమీ కర్మ...
.....బుల్ డోజర్ల ఘాతం క్షమస్వమే.... 
సహజ వాయువల కోసం నీ వంటి నిండా చిల్లులు పెట్టి జల్లెడ కొడుతున్నాం, డ్రిల్లెర్ల (drillers)  ఘాతం క్షమస్వమే...బౌగోళిక సమతుల్యాన్ని కాపాడే కొండల్ని పిండి కొడుతున్నాం, డైనమైట్ల ఘాతం క్షమస్వమే...
ప్రమాదమని తెలిసి కూడా నీలో జీర్ణం కానీ ప్లాస్టిక్ని విచ్చలవిడిగా తయారు చేసి, నీ నెత్తిన పారేస్తున్నాం,     ప్లాస్టిక్  ఘాతం క్షమస్వమే......  
ఇలా మేము చేస్తున్న ఆకృత్యాల దండకం అంతా విని, మమ్మల్ని నీవైతే క్షమించగలవేమో కానీ (భూదేవికి ఓర్పు ఎక్కువంటారుగా), మా భావితరాలు మాత్రం మమ్మల్ని ఎప్పటికీ క్షమించరు.

రోజూ రోజుకీ 
నవ నాగరికం - అభివృద్ధి పేరుతో, మనిషి అభినవ హిరణ్యాక్షుడుగా మారి, నందనవనంగా వెలుగొందవలసిన ఈ భూమండలాన్ని, రుద్రభూమిగా - నిర్జీవమైన జల సమాధిగా మార్చేస్తున్నా,మౌనంగా తిలకిస్తున్న ఆ ప్రళయ వరాహమూర్తికి విన్నవించి, మా తత్వాన్ని పెంపొందించి,  మమ్మల్ని ఉద్దరించి, మా భవిష్యత్తు తరాలవారికి ప్రాణవాయువు నిలిచేలా చూడు తల్లీ ధరణీ మాతా. 
                              


 ధనుర్ధరాయై చ విద్మహే                              
 సర్వ సిద్ధాయై చ ధీమహీ 
 తన్నో ధరా ప్రచోదయాత్



జైకిషన్ శింగరాజు